విండోసు లైవ్ తెలుగులో..

విండోస్ లైవ్ ఉపకరణాలన్నీ ఇప్పుడు తెలుగులో లభ్యమవుతున్నాయి. http://download.live.com (ఈ పేజికూడా తెలుగులో కనిపిస్తుంది) కు వెళ్లి లైవ్ రైటర్, మెసెంజర్, ఫోటో గాలరీ మొదలైన వాటినన్నింటినీ నుండి డౌన్లోడు చేసుకొనండి. ఈ ఉపకరణాలన్నీ తెలుగు ఇంటర్ఫేసును కలిగి ఉన్నాయి.

image

image

image image

 

ఈ ఉపకరణాలే కాకుండా విండోసు లైవ్ స్పేసులోని ఆన్లైను సర్వీసులు కూడా తెలుగు ఇంటర్ఫేసుతో మనం వాడుకొనడానికి సిద్దంగా ఉన్నాయి. http://spaces.live.com/ కు వెళ్లి మీరు ఒక బ్లాగును సృష్టించుకోవచ్చు, skydrive ను ఉపయోగించి 25జిబి వరకు మీ ఫైళ్లను ఎగుమతి చేసుకొనవచ్చు ఇంకా ఫోటోలు గట్రా ఎగుమతి చేసుకోవచ్చు. UI కూడా గతంతో పోలిస్తే చాలా మెరుగు పడింది.

ఐ.ఐ.టి – ఐ.టి.ఐ

గిరి గారు వ్రాసిన A bolt from the blue అనే టపా చూశాక నాకు ఇది గుర్తొచ్చింది.

మా మిత్రుడొకరికి, ఐ.ఐ.టి బాంబే లో సీటు వచ్చింది. బాంబే వెళ్లబోయే ముందు బట్టలు కుట్టించుకోడానికి వాళ్ల ఇంటి దగ్గరున్న టైలరుకు దగ్గరకు వెళ్లాడు. అప్పుడు వారి మద్య జరిగిన సంభాషణ ఇది.

టైలరు: చదువుకోడానికి బొంబాయి వెళ్తున్నావటగా?

మిత్రుడు: అవును ఐ.ఐ.టి బొంబాయిలో సీటొచ్చింది.

టైలరు: ఇంకొంచం కష్టపడి చదివితే గుంటూరు డాన్ బాస్కో ఐ.టి.ఐ లోనే సీటొచ్చేది కదా. మీవాళ్లు నిన్నంత కష్టపడి చదివిస్తోంటే నువ్వామాత్రమైనా చదవకపోవడం ఏం బాగాలేదు.

అంతే మావాడు తరువాత ఇంకెప్పుడు ఆ టైలరు దగ్గరకు వెళ్లలేదు 🙂

మానవత్వం పరిమళిస్తోందా…

అవుననే అనిపిస్తుంది ఈమద్య జరిగిన రెండు సంఘటనలను చూస్తే..

1. అది మా కంపనీలోని తెలుగువారి మెయిలింగు లిష్టు. బజాకం అవడం వల్ల ఇండియాలోని వారు, అమెరికాలోని వారు కూడా ఉంటారు. అయితే, సాదారణంగా దీనికి రోజుకు రెండు మూడు కంటే ఎక్కువ ఉత్తరాలు రావు. అవి కూడా వారికి అమెరికా నుండి ఇండియాకు లేదా ఇండియానుండి అయెరికాకు ప్రయాణంలో తోడుకావాలి, ఎవరైనా ఉన్నారా అని. అయితే, ఒక రోజు పొద్దున ఆఫీసుకు వెళ్లిన నేను ఆ లిష్టులో 120 పైనే మెయిల్లండటం చూసి ఆశ్చర్యపోయాను. విషయమేమిటా అని చూస్తే ఆరోజు ఎవరో ఒకతను(మాకంపనీలో పనిచేసే అతను కాదు) దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించడం జరిగినది. అతని మృతదేహాన్ని ఇండియాకు తరలించడానికి ఆర్ధిక సహాయం చేయాలని ఒక ఉత్తరం ఉంది. దానికి సమాధానంగా, అందరూ డబ్బు ఎవరికి ఇవ్వాలి ఏమిటి అనేవిషయాన్ని కనుక్కోడానికి మెయిల్లు చేయడమే కాక, కొద్ది గంటల వ్యవదిలోనే చాలా మొత్తాన్ని అందించారు. అయితే, వారి కుటుంబం అంత్యక్రియలను అక్కడే నిర్వహించాలని నిర్ణయించుకోవడంతో, ఆ సేకరించిన డబ్బును మరణించినతని కుటుంబానికి అందివ్వాలని నిర్ణయించారు.

2. అదే కంపనీలోని, కొన్నివిద్యాసంస్థల పూర్వ విద్యార్థుల మెయిలింగు లిష్టు. ఈసారి మెయిల్లో ఎవరో ఒక వార్తా పత్రికనుండి పంపించిన కథనం ఉంది. దాని ప్రకారం బీహారులోని ఒక విద్యార్ధినికి ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు వచ్చినా ఆర్ధిక స్థోమత లేక ఆ విద్యాసంస్ధలో చేరలేక పోయింది. అయితే అందులో ఆమె చిరునామాగాని, మరే ఇతర వివరాలు గాని లేవు. అది చూసిన వెంటనే కొందరు సహాయం చేయడానికి ముందుకొచ్చి, ఆ పత్రికా కార్యాలయానికి ఫోను చేసి, ఆ వార్తను వ్రాసిన విలేఖరి వివరాలు కనుక్కొని, అతని ద్వారా ఆమె వివరాలు తెలుసుకొని మిగతా వారందరికీ అందించారు.

ఇవి రెండు సంఘటనలను చూసిన తరువాత, మనలో మానవత్వంకలవారే కాక, సకాలంలో సహాయం అందించాలనే ఆతృత గలవారు చాలా మందే ఉన్నారని నాకనిపిస్తుంది.

మైక్రోసాఫ్టు సర్ఫేస్..

మనం కంప్యూటరు వాడే విధానాన్ని పూర్తిగా మార్చేయడానికి మైక్రోసాఫ్టు విడుదల చేసిన ఈ క్రొత్త రకం కంప్యూటరును చూడండి. టేబులులా ఉండే ఈ కంప్యూటరులో మనం వస్తువులను చేత్తో జరిపినట్లుగా, కంప్యూటరులోని ఫోటోలు మొదలయినవాటిని కూడా చేత్తో అటూ, ఇటూ జరిపేయవచ్చు. ఇంతే కాక దీనిని మొబైలు ఉపకరణాలతో అనుసంధానం చేయడం కూడా చాలా సులభం. మైక్రోసాఫ్టు సర్ఫేసు అని నామకరణం చేసిన ఈకంప్యూటరును, ఈసంవత్సరాంతానికి హోటల్లు, కాసినోలు, రెస్టారెంట్లవంటి వాటికి అందుబాటులోకి తేనున్నది. అయితే, మొదట్లో దీని ధర దాదాపు 5-10 వేల డాలర్లు(రూ. 2 – 4 లక్షలు) ఉన్నప్పటికీ, ఇంకో 3-5 సంవత్సరాలలో సాదారణ ప్రజాణీకానికి అందుబాటు ధరలలో లభించవచ్చు.

 మరిన్ని వివరాలకు..  http://www.microsoft.com/surface/ చూడండి.

వాసిరెడ్డి రంజిత్

ఈరోజు (మే 7) మితృడు, ఒక గొప్ప విధ్యార్ధి అయిన వాసిరెడ్డి రంజిత్ 25వ జన్మదినం. చిన్నవయసులోనే ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన రంజిత్ గత సంవత్సరం జులై 10న ఈత కొలనులో ప్రమాదవశాత్తు మునిగి, తనువు చాలించాడు. అతని సి.వి.లో 1981 మే 7 జన్మదినం అని ఉన్నా నిజానికి అతను 1982 లోజన్మించాడు. ఒక మంచి ఫ్రొఫెసరు అవుతాడనుకున్న రంజిత్, 25 సంవత్సరాలు కూడా నిండకుండానే మనల్ని వీడి వెళ్లిపోవడం భాదాకరమైన విషయం. రంజిత్ ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటూ…

పెట్టుబడి పాఠాలు పట్టవా?

ఆధారం: http://www.eenadu.net/archives/archive-23-4-2007/emsmain.asp?qry=2204ems8

పెట్టుబడి పాఠాలు పట్టవా?

మార్కెట్‌తో మంచే జరుగుతుంది
సోషలిజం వైపు మళ్లడం అహేతుకం

గురుచరణ్‌దాస్‌

ఆర్థిక సంస్కరణల లోతైన పాఠాల నుంచి మనం ఇంకా ఏమీ నేర్వలేదన్న విషయాన్ని- ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఇటీవల చేపట్టిన చర్యలు రుజువుచేస్తాయి. ఇదే విధానం కొనసాగితే- 1991 దాకా నాలుగు దశాబ్దాలపాటు దేశంలో వర్ధిల్లిన బ్యూరోక్రాటిక్‌ సోషలిస్ట్‌ రాజ్యంలోకి మళ్లీ మనం మళ్లినా ఆశ్చర్యంలేదు. 1970లలో కమాండ్‌, కంట్రోల్‌ ఆర్థిక వ్యవస్థ ఉచ్ఛస్థాయిలో ఉండేది. దాన్ని ‘గరీబీ హఠావో’లాంటి జనాకర్షక నినాదాల్తో సమర్థించుకున్నాం. ప్రస్తుత యూపీఏ ప్రభుత్వం సిమెంటు, ఉక్కు ధరలపై మళ్లీ నియంత్రణలు తీసుకువచ్చింది. నిరంతరాయంగా పెరిగే వడ్డీరేట్లు ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఏ మాత్రం ఉపకరించవు. చిన్న ఇల్లు కట్టుకోవడానికో, చిరు వ్యాపారం ప్రారంభించడానికో ఖర్చు తడిసిమోపడయ్యేలా మాత్రం ఇది తోడ్పడవచ్చు. వ్యవసాయ ఉత్పత్తుల ఫార్వర్డ్‌ ట్రేడింగ్‌ను నిషేధించారు. వాస్తవానికి ఫార్వర్డ్‌ ట్రేడింగ్‌ ద్రవ్యోల్బణాన్ని కొంతలో కొంత అదుపులో ఉంచుతుంది. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తులు సీజన్‌లోనే వస్తాయి. కానీ ఆహార వినియోగం ఏడాది పొడుగునా ఉంటుంది. అభివృద్ధి నిరోధానికి ద్రవ్యోల్బణాన్ని కుంటిసాకుగా చూపుతున్నారు. ‘లైసెన్స్‌ రాజ్‌’ పునరుద్ధరణకూ ఇదే ఓ బూచిగా కూడా కావొచ్చు.

చాలామంది భారతీయులు ముఖ్యంగా మేధావులు మార్కెట్‌ను ఎందుకు ద్వేషిస్తారని చాలాసార్లు నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటా. నాకు రెండు సమాధానాలు స్ఫురిస్తాయి. మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థను కాపాడే ఓ పెద్దదిక్కంటూ లేదు కాబట్టి దానికి దూరంగా ఉండటం మేలని జనం అనుకోవడం ఇందులో మొదటిది. మార్కెట్‌ను వ్యాపారితో సరిపోల్చి, అతనో మోసగాడని అనుకోవడం ఇందులో రెండోది. కాబట్టి మార్కెట్‌ను గాడిలో పెట్టడానికి ప్రభుత్వ పెద్దచేతులు ఎంతో అవసరం. సాధారణ పౌరుడికి మార్కెట్‌ మంచి మిత్రుడన్న విషయాన్ని మనం విస్మరిస్తున్నాం. ఎలా అంటే… వ్యాపారిని, రాజకీయ నాయకుడినీ పోటీపడేలా చేసేది మార్కెట్‌ ఒక్కటే. అంతర్జాతీయ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని మన మార్కెట్‌ను అనుమానాస్పద దృష్టితో చూస్తున్నాం. ఈ అనుమానం పెనుభూతం కావడం వల్లే బహుళజాతి కంపెనీలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు బలి అవుతున్నారు. ఈ వ్యాకులతతోనే స్వదేశీ వస్తువుల వైపు మొగ్గుచూపుతున్నాం. కానీ ఇది అహేతుకం. ఎందుకంటే కంపెనీల మధ్య పోటీ వల్ల సామాన్యుడికి మేలు జరుగుతుంది. ధరలు తగ్గుతాయి. వస్తూత్పత్తి నాణ్యత మెరుగుపడుతుంది.

1991 నాటికే కాలం చెల్లిపోయిన సోషలిజం వైపు మళ్లీ మళ్లడం అహేతుకం. సోషలిజంలోని లోటంతా సామర్థ్యమే, అంతేతప్ప నమ్మకం లేకకాదు. సోషలిజం బాగాపనిచేసి ఉంటే మనమంతా ఈ రోజు సోషలిస్టులుగా ఉండేవాళ్లం. దారిద్య్రాన్ని, అణచివేతల్ని తరిమికొట్టి సమసమాజాన్ని నిర్మించడానికి ఉద్దేశించిన సిద్ధాంతమది. కానీ దురదృష్టవశాత్తూ ప్రపంచంలో ఎక్కడచూసినా ఇది ఆధిపత్య రాజ్యస్థాపనకు, ప్రజల అణచివేతకు దోహదపడింది. దీనికి సాక్ష్యాలు అనేకం. 20వ శతాబ్దం ద్వితీయార్థంలో సోషలిజంపై అనేక ప్రయోగాలు జరిగాయి. జర్మనీ, కొరియా, వియత్నాం(ఆఖరికి చైనాలో కూడా 1980 దాకా)లు రెండుగా విడిపోయి, ఓవైపు కేపిటలిజం, మరోవైపు సోషలిజం రాజ్యాలు ఏర్పడ్డాయి. ప్రతిచోటా పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్న భాగంలో అభివృద్ధి బాగా జరిగింది. స్వేచ్ఛ, అవకాశాలు ఇక్కడే మెరుగ్గా ఉన్నాయి. కానీ ఇప్పటికీ చాలామంది భారతీయులు మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థను అంగీకరించడానికి ఇబ్బందులు పడుతున్నారు.

సామాన్యులకు ముఖ్యంగా పేదలకు ఉపయోగపడదనే కారణంపై చాలామంది మార్కెట్‌ను నమ్మరు. కానీ వాస్తవం దీనికి విరుద్ధం. భారత్‌, చైనాల్లో ప్రజలు మార్కెట్‌ వల్లే ఎక్కువ ప్రయోజనం పొందారనేది చరిత్ర చెప్పిన సత్యం. అలాంటపుడు ఎందుకీ అపోహలు ఏర్పడినట్లు? నా మిత్రుడు రఘురామ్‌ రాజన్‌, అతని సహచరుడు ల్యూగీ జింగాలెస్‌లు తమ ‘సేవింగ్‌ కేపిటలిజం ఫ్రం కేపిటలిస్ట్స్‌’ అనే తమ పుస్తకంలో దీనికో సమాధానం ఇచ్చారు. స్వేచ్ఛా మార్కెట్‌కు కూడా నిబంధనలుండాలని వారు వాదించారు. కానీ ఈ నిబంధనల్ని రాజకీయంగా శక్తిమంతమైనవారు తమ ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందిస్తారనేది మనకు తెలిసిన సత్యం.

తక్కువ దిగుమతి సుంకాల వల్ల సామాన్యులకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందన్న విషయం మనందరికీ తెలుసు. దీనివల్ల ధరలు తగ్గుతాయి. నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి. కానీ చాలామంది భారత పారిశ్రామిక వేత్తలు ప్రపంచ పోటీ అంటే భయపడతారు. ఎక్కువ దిగుమతి సుంకాల కోసం ఒత్తిళ్లు తెస్తుంటారు. స్వేచ్ఛా విపణిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రభుత్వ గుత్తాధిపత్యాల వల్ల లక్షలకొద్దీ వినియోగదారులు నష్టపోతుంటారు. ప్రభుత్వరంగంలోని కార్మికులు మాత్రం ప్రైవేటీకరణను అడ్డుకుంటూ ఉంటారు. ప్రభుత్వ యాజమన్యం వల్ల రాజకీయ నాయకులు, బ్రూరోక్రాట్లు, ప్రభుత్వ రంగంలోని కార్మికులు మాత్రమే ప్రయోజనం పొందుతారు. శక్తిమంతమైన పారిశ్రామికవేత్తలు, కార్మిక సంఘాల గుప్పిట్లోకి మార్కెట్‌ వెళ్లకుండా సామాన్యుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిబంధనలు తయారుచేయడమన్నదే మన ముందున్న సవాలు.

కేపిటలిజంపై ఏహ్యభావానికి పదప్రయోగ సంబంధ కారణమూ ఉందని నేను అనుకుంటూ ఉంటా. భారత్‌లో చాలామంది కేపిటలిజంను స్వార్థంతో సరిపోలుస్తుంటారు. అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్‌స్మిత్‌ స్వప్రయోజనం అనే మాట వాడినపుడు సామాన్యుడిని దృష్టిలో ఉంచుకున్నాడే తప్ప మరో ఉద్దేశంతో కాదు. మనం మార్కెట్‌కు వెళ్లినపుడు తక్కువధరకు నాణ్యమైన మామిడిపండ్లు కావాలని కోరుకుంటాం. ఇది స్వార్థంకాదు, స్వప్రయోజనం. కొనుగోలు, అమ్మకాల్లో ప్రతివ్యక్తీ ఇతరులకు ప్రయోజనం చేకూరుస్తూనే… తానూ ఎంతోకొంత ప్రయోజనం పొందుతాడు. సొంత ప్రయోజన ప్రవర్తనతో ప్రతిఒక్కరూ లాభపడతారు. కానీ స్వార్థం కలిగిన వ్యక్తి నైతికంగా తటస్థంగా ఉండడు. ఇతరుల ప్రయోజనాన్ని దెబ్బతీసి తన ప్రయోజనం కోసం పాటుపడతాడు. సంప్రదాయ, సోషలిస్టు సమాజాల్లో స్వార్థపరులున్నట్లే… మార్కెట్లోనూ స్వార్థపరులున్నారు.
(రచయిత ప్రోక్టర్‌ అండ్‌ గాంబుల్‌ ఇండియా
మాజీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌)

సీ.డీలు – డీ.వీ.డీలు

మోసరుబేరు కంపెనీవాడు ఈమద్య 28 రూపాయలకే సినిమా సీడీలు మరియు 34 రూపాయలకే డీవీడీలు అమ్మడం మెదలు పెట్టాడు. వీడు చేసిన ఇంకొక మంచిపని ఆన్లైలోకూడా కొనుక్కునే విధంగా ఒక సైటును రూపొందించడం. మీరు భారతదేశంలో ఏమూలనున్నా http://www.moserbaerhomevideo.com/సైటులోనికి వెళ్ళి, మీకు కావలసిన సినిమాల సీడీలు, డీవీడీలు కొనుక్కోవచ్చు. ఆ సీడీలను మీకు బట్వాడా చేయించుకోడానికి మాత్రం అధనంగా ఇంకొక 50 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అయితే, 20 కంటే ఎక్కువ సీడీలు/డీవీడీలు కొన్నవారికి మాత్రం ఉచితంగా బట్వాడా చేస్తానని చెబుతున్నాడు.

మొబైలులో తెలుగు వెలుగులు

ఇప్పుడు మీరు మైక్రోసాఫ్టు డీప్‌ఫిష్ సహాయంతో విండోసు మొబైలులోకూడా తెలుగును చక్కగా చూడవచ్చు. ఉదాహరణకు ఇక్కడ కొన్ని తెరచాపలను ఉంచాను. మరిన్ని వివరాలకు ఈ క్రింది లంకెను అనుసరించండి.

డీప్‌ఫిష్ అంటే ఏమిటి?

క్రికెట్టులో భారత పరాజయానికి కారణమయిన ఇద్దరు

1. ఇందిరాగాంధీ – బాంగ్లాదేశ్ ఏర్పాటు చేసినందుకు..

2. హనుమంతుడు – లంకను పూర్తిగా కాల్చనందుకు..

(నాకు వచ్చిన ఫార్వర్డు మెయిలు నుండి)

ఇన్సూరన్సు – టర్ము పాలసీలు, ఎండోమెంటు పాలసీలు

మార్చి వస్తోందంటేనే ఉద్యోగస్తులదరి దృష్ఠి ఆదాయపు పన్ను మీదే ఉంటుంది. కారణం, ఈపన్నుపోటు తప్పించుకొనడానికి ఏమిచెయ్యాలన్నా ఇదే ఆఖరునెల కావడం. పన్ను తప్పించుకోడానికి సాదారణంగా అందరూ చేసే పని ఆలోచించకుండా మన ఏజంటు చెప్పిన దాన్నిబట్టి ఏదో ఒక ఇన్సూరన్సు పాలసీ తీసేసికోవడం. ఇలా ఆలోచించకుండా ఏ పాలసీపడితే, ఆపాలసీ తీసుకోవడం వల్ల కలిగే లాభనష్టాల గురించి ఇక్కడ చర్చిద్దామనుకుంటున్నాను.

ముందుగా మనం తెలుసుకొనవలసిన విషయం ఏమిటంటే, ఇన్సూరన్సు పాలసీలు పన్ను ఆదా చేయడం కోసం ఉద్దేశించినవి కావు. మనకేదైనా జరుగరానిది జరిగితే, మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఆర్ధికంగా ఎప్పటిలాగానే జీవించగలిగేలా చూడటానికి ఈపాలసీలు ఉద్దేశింపబడ్డాయి. ఈ ఇన్సూరన్సు పాలసీలను స్థూలంగా, రెండు రకాలుగా విడగొట్టవచ్చు

  1. ఎండోమెంటు పాలసీలు

    ఈరకం పాలసీ అమలులో ఉన్నప్పుడు విధివశాత్తు మరణం సంభవించినట్లయితే, మన కుటుంబానికి పాలసీ మొత్తాన్ని, దానితోపాటుగా అప్పటి వరకు మనం చెల్లించిన మొత్తంమీద కొంత వడ్డీని (దీనినే బోనస్సు అనికూడా అంటారు) అందజేయడం జరుగుతుంది. లేకపోతే, పాలసీ గడువుతీరినప్పడు పాలసీమొత్తాన్ని కొంత వడ్డీతో కలిపి మనకు చెల్లిస్తారు. ఈపాలసీలకు ఉదాహరణగా L.I.C వారి జీవన్ శ్రీ మరియు జీవన్ ఆనందులను చెప్పుకొనవచ్చు.

  2. టర్ము పాలసీలు

    ఈపాలసీలు అమలులో ఉన్నప్పుడు, ఏదయినా కారణం వల్ల మనకు మరణం సంభవించినట్లయితే, మన కుటుంబానికి పాలసీ మొత్తాన్ని అందజేస్తారు. వీటిలో మనం చెల్లించవలసిన ప్రీమియం తక్కువగా ఉండి, పాలసీ మొత్తం చాలా ఎక్కువ ఉంటుంది. ఈరకానికి చెందిన పాలసీలలో, గడువు ముగిసినప్పుడు మనం చెల్లించినదానిలో ఏమీ తిరిగి ఇవ్వరు. ఈరకానికి ఉదాహరణగా L.I.C వారి అమూల్య జీవన్ మరియు అన్మోల్ జీవన్ పాలసీలను చెప్పుకొనవచ్చు. 
     

ఇప్పుడు, ఈ రెండు రకాల పాలసీలలో ఏది తీసుకొనడం ఆర్ధికంగా మనకు మంచిదో చూద్దాం. ఉదాహరణకు, రాము అనేవ్యక్తిని తీసుకుందాం. ప్రస్తుంతం రాము వయసు 25 సంవత్సరాలు. అతను 15 సంవత్సరాలపాటు, 25 లక్షలకు ఇన్సూరన్సు పాలసీ తీసుకొందామనుకున్నాడు. ఇంత మొత్తానికి ఎండోమెంటుపాలసీ తీసుకోడానికి, సంవత్సరానికి చెల్లించవలసిన ప్రీమియం ఎంతో L.I.C వారి ప్రీమియం కాలిక్యులేటర్లో చూస్తే రూ.1,65,114 అని తేలింది. ఇదే మెత్తానికి టర్మ్ పాలసీ కోసమయితే అతను సంవత్సరానికి కేవలం రూ.5,550(అవును, కేవలం అయిదువేల అయిదు వందలే!) చెల్లిస్తే సరిపోతుంది. ఇలా టర్ము పాలసీ తీసుకోగా మిగిలిన మొత్తాన్ని రాము కనుక వేరేవిధంగా మధుపు చేస్తే పాలసీ గడువు ముగిసే సరికి ఎండోమెంటు పాలసీలోకంటే ఎక్కువ మెత్తాన్ని ఆర్జించవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.
 
ఎండోమెంటు పాలసీల మీద సాదారణంగా చాలా తక్కువ మొత్తం వడ్డీ(వారి బాషలో బోనస్సు) చెల్లిస్తారు. అందరూ ఎక్కువగా ఎండోమెంటుపాలసీలు తీసుకొనే L.I.C వారు, గడచిన 4-5 సంవత్సరాలుగా ఇస్తున్న బొనస్సు 4-5 శాతం మాత్రమే. 5 శాతం బోనస్సు ప్రకారం చూస్తే రాము ప్రతిసంవత్సరం రూ.1,65,114 చెల్లిస్తే, 15 సంవత్సరాల తరువాత జీవించి ఉంటే అతనికి రూ.37,41,069 తిరిగి వస్తాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఈగడువులో అతను మరణిస్తే అతని కుటుంబానికి 25 లక్షలు + అప్పటి వరకు వచ్చిన బోనస్సు ఇవ్వబడుతుంది.
 
అదే రాము, పైన చెప్పిన విధంగా రూ. 5500 టర్ము పాలసీని తీసుకొని, మిగిలిన రూ. 1,59,614 మెత్తాన్ని PPFలో పెట్టాడనుకుందాం. గత 4-5 సంవత్సరాలుగా తీసుకొంటే PPF లో సాలీనా 8-10 శాతం వడ్డీ వస్తుంది. 8 శాతం వడ్డీ ప్రకారం చూస్తే 15 సంవత్సరాలు ముగిసే సరికి రూ.46,80,566 తిరిగి పొందవచ్చు. ఒకవేళ ప్రమాదవశాత్తు రాము ఈగడువులో మరణించినట్లయితే టర్ముపాలసీనుండి 25 లక్షలు + PPF లో అప్పటి వరకు జమయిన మొత్తం, వడ్డీతో సహా అతని కుటుంబానికి అందుతాయి.
 
ఇదే రూ. 1,59,614లను, రాము పన్ను మినహాయింపు ఉన్న మ్యూచుయల్ ఫండులలో(E.L.S.S) పెడితే ఇంకా ఎక్కువ రాబడి సాధించే అవకాశంకూడా ఉంది. గత 5-6 సంవత్సరాలలో సంవత్సరానికి 50 శాతం వరకు రాబడి ఇచ్చిన ఫండులు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలోకూడా 15 సంవత్సరాల పాటు సాలీనా 50% రాబడి ఆశించడం అత్యాశే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో 15% రాబడి ఆశించడం అత్యాశ కాబోదు. ఇలా సాలీనా 15% రాబడి వస్తే రాము 15 సంవత్సరాల తరువాత రూ. 87,33,676 పొందవచ్చు. 
 

ఇప్పుడు మీలో కొందరికి వచ్చే అనుమానాలను ఇక్కడ తీర్చడానికి ప్రయత్నిస్తాను. 

  1.  నేను ఎంత మెత్తానికి ఇన్సూరన్సు పాలసీ తీసుకోవాలి?
  2. సాదారణంగా మనకు వస్తున్న ఆదాయం మీద మన కుటుంబ జీవన శైలి ఆధారపడి ఉంటుంది. మీరులేనప్పుడు కూడా మీకుటుంబం అలానే జీవించాలంటే ఎంత మొత్తం సరిపోతుందనుకుంటున్నారో, అంతకు తీసుకోండి. సాదారణంగా (సంవత్సర ఆదాయం * 8 – ప్రస్తుతం మనకున్న ఆస్తి) కి పాలసీతీసుకుంటే  సరిపోతుంది. ఇవి కొంచం పెద్దమొత్తంలో ఉంటాయి కాబట్టి, చాలా మందికి అవసరమయినంత పాలసీ తీసుకోవాలంటే కేవలం టర్ము ప్లానులోనే సాధ్యమవుతుంది.

  3. నా ఇన్సూరన్సు ఏజంటు ఎండోమెంటు పాలసీలను తీసుకొనమని గట్టిగా చెబుతున్నాడు, ఎందుకు?
  4. ఎందుకంటే, అతనికి వచ్చే కమీషను దానిలోనే ఎక్కువ కాబట్టి. సాదారణంగా పాలసీలలో మనం చెల్లించే ప్రీమియంలో 10 శాతం వరకు మన ఏజంటుకు అందుతుంది. ఎండోమెంటు పాలసీలలో మనం చెల్లించే ప్రీమియం అధికంగా ఉంటుంది కాబట్టి వారికి వచ్చే కమీషను కూడా అధికమే. అదికాక, ఎండోమెంటు పాలసీలో అయితే మెదటి సంవత్సర వాయిదాలలో అధనంగా మరొక 25% వారికే వెల్తుంది. అందుకే చాలా మంది ఏజంట్లు మెదటి ప్రీమియం చెల్లించడానికి కూడా సిద్దపడుతుంటారు.

  5. ఎండోమెంటు పాలసీలలో వచ్చే బోనస్సు(వడ్డీ) రేటు ఎందుకంత తక్కువగా ఉంటుంది?
  6. దీనికి కూడా ఏజెంట్లకి ఇచ్చే కమీషను ఒక ప్రధాన కారణం. మెదట్లో ఇన్సూరన్సుల గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఏజంట్లకు ఎక్కువ కమీషను ఇవ్వడం మెదలు పెట్టి ఉండొచ్చు. ఇవి కాక ఇన్సురన్సు కంపనీలు మన డబ్బును ఎక్కడ మదుపు చేస్తున్నాయన్న దాని మీద కూడా మనకొచ్చే బోనస్సు ఆధారపడి ఉంటుంది.

  7. యూలిప్పులని (ULIP), హోల్ లైఫులని ఇంకా వేరే రకాల పాలసీలు వస్తుంటాయి కదా, వాటిగురించి?
  8. ఏరకమయిన పాలసీ అయినా దాదాపు ఒకే పద్దతిలో నడుస్తుంటుంది. మనం చెల్లించినదానిలో కొంత మెత్తాన్ని మన ఇన్సూరన్సుకోసం ఉంచి మిగిలిన దాన్ని స్టాకు మార్కెట్టులోనో, ఇంకో దాంట్లోనో మదుపు చేస్తారు. ఏపాలసీ అయినా ఎంచుకునే ముందు మీరు చెల్లించే దానిలో ఎంత మొత్తాన్ని వారు మదుపు చేస్తున్నారో తెలుసుకోండి. మిగతా మొత్తం వారి నిర్వహణా వ్యయాలకు పోతుంది. అంత నిర్వహణా వ్యయంతో మీకు సరిపోయినంత ఇన్సూరన్సును మీరు తీసుకొనగలరో లేదో ఆలోచించండి. నా అభిప్రాయం ప్రకారం, ఇలాంటి వాటి జోలికి పోకుండా పైన చెప్పిన విధంగా మీకు కావలసినంత పాలసీని టర్ము ప్లానులో తీసుకొని మిగతాది మీ అభిరుచికి తగ్గట్లుగా వేరే దానిలో మదుపుచేసుకొనడం ఉత్తమం.

గమనిక: నేనొక సాదారణ కంప్యూటరు కూలీని. ఇవన్నీ నాఅవసరం కొరకు నేను పరిశోధన చేసి తెసుసుకొన్న విషయాలు. కొందరికైనా ఉపయోగ పడవచ్చని ఇక్కడ రాస్తున్నాను. నేను ఆర్ధిక నిపుణున్ని కాను కాబట్టి నావిశ్లేషణలో  కొన్ని తప్పులుండవచ్చు. ఇలాంటి వ్యాసాలు రాయడం ఇదే మెదటిసారి కాబట్టి, దీనిలో భాషా పరమయిన తప్పులుకూడా ఉండొచ్చు. వీటిని నాదృష్టికి తెచ్చినట్లయితే సరిచేసుకోడానికి ప్రయత్నిస్తాను.

నాకు ఆధారమయిన కొన్ని లంకెలు:

http://ia.rediff.com/money/2003/nov/17perfin1.htm
http://www.rediff.com/money/2005/jan/04perfin1.htm
http://www.chennaionline.com/finance/insurance-news002.asp